
*అమానుల్లా వైస్సార్సీపీ స్టేట్ లీడర్ మాట్లాడుతూ వ్యవసాయ రుణాల మాఫీ పథకాన్ని కేవలం అమరావతి రైతులకు మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని,వ్యవసాయం గిట్టుబాటు కాక వ్యవసాయము దండుగ అనే పరిస్థితి నెలకొని ఉంది అన్నారు. పంట పండించడం ఒక ఎత్తు అయితే దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం, అమ్ముకోవడం మరొక ఎత్తు అయింది.ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. తోతాపురి మామిడి, మిర్చి, పొగాకు, పసుపు, అరటి, చీని, ఉల్లి, టమోటో, బుడ్డ శనిగ ఇలాఏపంటకు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదు. అడిగే వారు లేరు, కొనేవారు లేరు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు కేంద్రాలు తెరవకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నాయి. పంటల బీమా అమలు కావడం లేదు.. పంట నష్టపరిహారం సకాలంలో అందడం లేదు. సున్నా వడ్డీ పథకానికి సున్నం పెట్టారు పావలా వడ్డీ పథకానికి పాడె కట్టడం జరిగింది.డ్రిప్ ఇరిగేషన్ అంతంత మాత్రమే. లేనిపోని యాపులు పెట్టి సకాలంలో రైతులకు ఎరువులు అందడం లేదు. పొలాల్లో ఉండాల్సిన రైతులు ఎరువుల అంగళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.ఈ ఆరు నెలల కాలంలోనే ఒక్కొక్క 50 కేజీల బస్తా మీద 500 రూపాయల నుంచి 800 రూపాయల వరకు ధర పెరిగింది.ట్రాక్టర్లకు వాడే డీజిల్ ధర పెరిగింది.ఈ పరిణామాల కారణంగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు.ఆ ఊబి నుండి బయటకు రాలేక ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. రైతుల ఆత్మ హత్యల్లో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో వ్యవసాయ రుణాల మాఫీ ఒక్కటే రైతును ఆదుకుంటుంది.అమరావతిలో రెండవ విడతభూ సమీకరణ కోసం భూములిస్తున్న ఏడు గ్రామాల పరిధిలోని రైతులకు ఒక్కొక్క కుటుంబానికి ఒకటిన్నర లక్షల రూపాయల వరకు రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఆ నిర్ణయాన్ని ఆ ఏడు గ్రామాల పరిధిలో ఉన్న రైతు కుటుంబాలకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు కుటుంబాలకు వర్తింపజేయాలని,ప్రతి రైతు కుటుంబానికి లక్షన్నర రూపాయలు వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని అమానుల్లా కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.