
*రైతు శ్రీధర్ రెడ్డి ఆవేదన.
సాక్షి డిజిటల్ న్యూస్ ఆగస్టు 05 అందోల్ (ప్రతినిధి జెల్ల భాగయ్య)అందోల్ మండలంలోని నేరేడు గుంట–ఎల్లమ్మ గడ్డ మార్గంలో గత 20 రోజుల క్రితం మిషన్ భగీరథ పైప్లైన్ పగిలిపోవడంతో భారీగా నీరు రోడ్లపై నుంచి సమీప పొలాల్లోకి వృథాగా ప్రవహిస్తోంది. దీంతో రహదారి దెబ్బతిని బురదమయంగా మారి వాహనదారులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రోజూ ఈ మార్గంలో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు, ఆటో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడే పరిస్థితి నెలకొంది. పైప్లైన్ లీకేజీ కారణంగా రోడ్డు కొంత మేర కుంగిపోవడంతో రాకపోకలు మరింత కష్టసాధ్యంగా మారాయి.ఈ సమస్యపై సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులకు పలుమార్లు సమాచారం ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పైప్లైన్ మరమ్మతులు చేపట్టి, దెబ్బతిన్న రహదారిని పునరుద్ధరించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.
