సాక్షీ డిజిటల్ న్యూస్ :- కాకినాడ జిల్లా పిఠాపురం జగ్గయ్యచెరువులో ఈనెల 7వ తేదీన ఓ పసికందు ఆ ఇంటి ఆవరణలో ఉన్న బావిలో శవమై తేలింది. అదే సమయంలో ఆ ఇంటి ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు వేసి క్షుద్రపూజలు జరిపి, పసికందును బలి ఇచ్చినట్లుగా కనిపించింది. సంచలనం రేకెత్తించిన ఈ కేసును పిఠాపురం పోలీసులు ఛాలెంజ్గా తీసుకున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టింది 5 నెలల ఆడ పసికందును హత్య చేసింది కన్నతల్లేనని, సూత్రధారి, పాత్రదారి ఆ పసికందు అమ్మమ్మేనని తేల్చారు పోలీసులు. కాకినాడ జిల్లా పిఠాపురంలో సంచలనం రేపిన పసికందు హత్య కేసు మిస్టరీ గుట్టును పోలీసులు విప్పారు. కన్నతల్లే హత్యలో కీలకపాత్ర పోషించడంతో స్థానికులు విస్తుపోయారు. తన జీవితం బాగుండాలంటే అడ్డుగా ఉన్న ఆడపిల్లను తప్పించాలనే దుర్మార్గపు ఆలోచన ఒకరిదైతే.. పసికందును మాయం చేసే ఉపాయం చెప్పిన పసికందు అమ్మమ్మ కుట్ర కోణం ఈ కేసులో వెలుగుచూసింది. ఆ పాప హత్యకు క్షుద్రపూజలు అనే ప్లాన్లు అమలుపరచినా పోలీసుల ముందు వారి ఆటలు సాగలేదు. ఎట్టకేలకు ఆధారాలతో చిక్కడంతో కటకటాలు పాలయ్యారు.పసికందు హత్యకు అసలు కారణమిదే..!పిఠాపురం జగ్గయ్యచెరువులో శైలజ, సతీష్ అనే ఇద్దరు ప్రేమికులు ప్రేమ వివాహం చేసుకుని జీవిస్తున్నారు. వీరికి 5 నెలల పసికందు ఉంది. పాపకు యశ్వంతిని అనే పేరు కూడా పెట్టారు. అయితే కొంత కాలంగా సతీష్, శైలజ మధ్య విభేదాలు తలెత్తాయి. సతీష్తో వేగలేనంటూ శైలజ మరో వివాహానికి సిద్ధపడింది. అడ్డుగా ఆడపిల్ల ఉండటంతో ఏం చేయాలో తెలియలేదు. శైలజ తల్లి అన్నవరం కూడా పసికందును వదిలించుకుంటే మంచిదని కూతురికి తప్పడు సలహా ఇచ్చింది. దీంతో ఇద్దరు పక్కా ప్రణాళికతో పసికందును చంపి ఇంటి ఆవరణలో ఉన్న బావిలో పడేశారు. తమ పాపని ఎవరో చంపినట్లుగా చుట్టుపక్కల వారిని నమ్మించడానికి క్షుద్రపూజలు జరిగినట్టు నాటకం ఆడారు.ఇంటి ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఉంచి, తమ పాపను క్షుద్రపూజలతో చంపారని కలరింగ్ ఇచ్చారు. అయితే పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తక్కువ సమయంలో కేసును నిగ్గు తేల్చారు. పసిపాప తల్లి శైలజ, ఆమె తల్లి అన్నవరం నిందితులుగా గుర్తించి జైలుకి పంపారు. లోతైన దర్యాప్తుతో అసలు నిజం బట్టబయలు.. పిఠాపురంలో స్థానికంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనలో వాస్తవాలు తెలుసుకున్న స్థానికులు విస్మయానికి గురైన పరిస్థతి కనిపించింది.. పసికందు శవమై బావిలో తేలడంతోపాటు అక్కడే క్షుద్ర పూజలు చూసినట్లు కనిపించడంతో పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. క్లూస్ టీంను సైతం రంగంలోకి దింపారు. దీంతో ఈకేసులో ప్రదాన నిందితులు పసికందు తల్లి శైలజ, అమ్మమ్మ అన్నవరంగా గుర్తించారు. వీరిని తమదైన శైలిలో విచారించిన పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కేసును తక్కువ సమయంలో ఛేదించిన క్రైమ్ పోలీసులను ఎస్పీ బిందుమాధవ్, అడిషనల్ ఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్లతోపాటు ఉన్నతాధికారులు అభినందించారు. నిందితులను కోర్టుకు హాజరుపరిచగా రిమాండ్ విధించినట్లు పిఠాపురం సిఐ జి.శ్రీనివాస్, ఎస్సై మణికుమార్లు తెలిపారు..