సహాయాన్ని మరచి శత్రువుతో చేతులు కలిపిన టర్కీ : బుద్ధి చెప్పిన భారత్

జ్ఞానతెలంగాణ:- భారత్, టర్కీల మధ్య ఒకప్పుడు సౌహార్దపూరితంగా ఉన్న సంబంధాలు ఇప్పుడు తీవ్రంగా క్షీణించాయి. టర్కీ పాకిస్థాన్‌కు సైనిక సహాయం అందించింది. ముఖ్యంగా డ్రోన్లు, ఆయుధాలు సరఫరా చేయడం ఈ విభేదాలకు కారణం. భారత్‌లోని పహెల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని టర్కీ ఖండించకపోవడమే కాక పాకిస్థాన్‌తో చేతులు కలపడం భారతీయులను కలవరపెట్టింది. గతంలో టర్కీ కష్టకాలంలో భారత్ అందించిన సహాయాన్ని మరచినట్లుగా టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో “టర్కీని బహిష్కరించండి” అనే నినాదంతో విస్తృతగా ఉద్యమం ఊపందుకుంది. ఈ విశ్వాస భంగం రెండు దేశాల సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుంది? ఈ సమస్య భారత విదేశాంగ విధానంలో ఏ మేరకు మార్పులను తెస్తుంది? 2023లో టర్కీలో సంభవించిన వినాశకర భూకంపం సమయంలో భారత్ “ఆపరేషన్ దోస్త్” పేరిట 250 మంది సిబ్బంది, ప్రత్యేక సామగ్రి, సహాయ సామాగ్రిని పంపింది. కోవిడ్-19 సంక్షోభంలోనూ టర్కీకి వైద్య సామగ్రిని అందించి సహకరించింది. అయితే, ఈ మానవతా సహాయాన్ని టర్కీ విస్మరించినట్లు కనిపిస్తోంది. మే 2025లో పహెల్గామ్‌లో 26 మంది పౌరుల మరణానికి కారణమైన ఉగ్రదాడిని టర్కీ ఖండించలేదు. బదులుగా, పాకిస్థాన్‌కు 350కి పైగా బైరక్తార్ టీబీ2, ఆసిస్‌గార్డ్ సాంగర్ డ్రోన్లను సరఫరా చేసింది. భారత సైనిక స్థావరాలపై దాడులకు ఈ డ్రోన్లను వినియోగించారని నివేదికలు చెబుతున్నాయి. ఎర్డోగాన్ పాక్ ప్రధాని షెహబాజ్ … పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్‌ను “విలువైన సోదరుడు” అని పిలవడం టర్కీ విదేశాంగ విధానాన్ని స్పష్టం చేసింది. భారత్‌లో ఈ పరిణామాలు తీవ్ర నిరసనలను రేకెత్తించాయి. “టర్కీని బహిష్కరించండి” అనే ఉద్యమం వ్యాపార, విద్య, పర్యాటక రంగాల్లో బలంగా వ్యాపించింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) టర్కీ, అజర్‌బైజాన్‌లతో దిగుమతి-ఎగుమతులను నిలిపివేసింది. మైంత్రా, అజియో వంటి ఈ-కామర్స్ సంస్థలు టర్కీ దుస్తుల బ్రాండ్ల విక్రయాన్ని నిలిపివేశాయి. పూణేలోని ఫలాల వ్యాపారులు టర్కీ ఆపిల్ దిగుమతులను, ఉదయ్‌పూర్‌లోని మార్బుల్ వ్యాపారులు టర్కీ మార్బుల్ దిగుమతులను ఆపేశారు. భారత్‌లో మార్బుల్ దిగుమతుల్లో 70 శాతం (సుమారు ₹2,500–3,000 కోట్లు) టర్కీ నుంచి వస్తుంది. పూణే ఫల మార్కెట్‌లో టర్కీ ఆపిల్ దిగుమతుల విలువ ₹1,000–1,200 కోట్లు ఉంటుంది. పర్యాటక రంగంలోనూ ఈ బహిష్కరణ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. 2024లో 3.3 లక్షల మంది భారతీయ పర్యాటకులు టర్కీని సందర్శించి, సుమారు ₹69 బిలియన్ల ఆదాయాన్ని అందించారు. కానీ, బహిష్కరణ నినాదంతో ఫ్లైట్ బుకింగ్‌లు 60 శాతం తగ్గాయి, రద్దీకరణలు 250 శాతం పెరిగాయి. గ్రీస్, కజకిస్థాన్, జార్జియా వంటి దేశాలకు పర్యాటకులు మళ్లుతున్నారు. టర్కీ పర్యాటక రంగం, 2024లో 6.22 కోట్ల మంది సందర్శకులతో $ 61.1 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది, ఇప్పుడు భారతీయ పర్యాటకుల కోల్పోవడంతో నష్టాన్ని ఎదుర్కొంటోంది. భారత ప్రభుత్వం కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకుంది. భారత విమానాశ్రయాల్లో సేవలు అందించే టర్కీ సంస్థ సెలెబీ ఏవియేషన్‌కు భద్రతా అనుమతులను రద్దు చేసింది. విద్యారంగంలో టర్కీ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలను రద్దు చేయాలని భారత విశ్వవిద్యాలయాల సంఘం సూచించింది. వాణిజ్య రంగంలో కూడా ఈ బహిష్కరణ ప్రభావం కనిపిస్తోంది. 2024 ఏప్రిల్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు భారత్ నుంచి టర్కీకి $5.2 బిలియన్ల ఎగుమతులు, టర్కీ నుంచి $2.84 బిలియన్ల దిగుమతులు జరిగాయి. చమురు, బంగారం, ప్లాస్టిక్, వాహన భాగాలు భారత్ ఎగుమతి చేస్తుండగా, టర్కీ నుంచి ఫలాలు, సిరామిక్స్, మార్బుల్ దిగుమతి అవుతాయి. వాణిజ్య బహిష్కరణ టర్కీ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఎర్డోగాన్ రాజకీయ విధానాలు టర్కీని మతోన్మాద దిశగా నడిపిస్తున్నాయని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఇది టర్కీ వ్యవస్థాపకుడు ముస్తఫా కెమాల్ అటాటుర్క్ స్థాపించిన లౌకిక, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం. భారత్‌లో ఈ బహిష్కరణ ఉద్యమం “వినియోగదారుల నేతృత్వంలోని దౌత్యం”గా రూపుదిద్దుకుంటోంది. మాల్దీవ్స్ ఉదాహరణ టర్కీకి హెచ్చరికగా నిలుస్తుంది. భారత పర్యాటకులపై ఆధారపడిన మాల్దీవ్స్, భారత్ నిషేధం తర్వాత ఆర్థికంగా కుదేలైంది. టర్కీ కూడా ఇలాంటి పరిణామాలను ఎదుర్కోవచ్చు. ఈ వివాదం భారత విదేశాంగ విధానంలో జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యంగా ఇస్తూ, గత సౌహార్దానికి మించి కఠిన నిర్ణయాల వైపు అడుగులు వేస్తోంది.