Header Banner

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త

సాక్షి డిజిటల్ న్యూస్ :- ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త వచ్చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రమోషన్‌ వ్యవస్థపై అధ్యయనం చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆధ్వర్యంలో 10 మంది మంత్రులతో ఈ సబ్‌కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పదోన్నతుల అమలు విధానం, కొత్తగా మధ్యస్థ (ఇంటర్‌మీడియేట్) పోస్టుల సృష్టి, వాటి పే స్కేల్స్‌ నిర్ణయం, అలాగే ఖాళీల భర్తీ విధానంపై సమగ్రంగా పరిశీలించనుంది. వీలైనంత త్వరగా అధ్యయనం పూర్తి చేసి ప్రభుత్వానికి సిఫార్సులు సమర్పించాలని సీఎస్‌ ఆదేశించారు. ఇటీవలే ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలను పూర్తి చేసింది. మే 31 నాటికి ఒకేచోట ఐదేళ్లు పూర్తి చేసిన వారిని బదిలీ చేసింది. అంధులు, గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లు పూర్తి చేసినవారు, మానసిక వికలాంగ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు, 40 శాతం పైగా వైకల్యంతో బాధపడేవారు, కారుణ్య నియామకాల కింద ఉన్నవారు, తీవ్రమైన వ్యాధులతో (క్యాన్సర్‌, ఓపెన్‌ హార్ట్‌, న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి) బాధపడుతున్నవారికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. భార్యాభర్తలు ఇద్దరూ సచివాలయాల్లో పనిచేస్తే ఒకరికి దగ్గర ప్రాంతాల్లో పోస్టింగ్‌ ఇచ్చేలా చర్యలు తీసుకుంది. ఇప్పుడు ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి పదోన్నతుల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది