Header Banner

జిన్‌పింగ్‌తో చర్చలు ముగిసిన ట్రంప్ – చైనాకు గుడ్‌న్యూస్!

సాక్షి డిజిటల్ న్యూస్ :అమెరికా, చైనా దేశాల మధ్య కొద్దికాలంగా టారిఫ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ టారిఫ్ ఉద్రిక్తతల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు దక్షిణ కొరియాలోని బుసాన్ వేదికగా గురువారం భేటీ అయ్యారు. వీరి భేటీ సుమారు రెండు గంటలపాటు సాగింది. ఈ భేటీలో ఇద్దరు దేశాధినేతలు కీలక అంశాలపై చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు.జిన్ పింగ్ తో భేటీ అనంతరం డొనాల్డ్ ట్రంప్ చైనాకు గుడ్ న్యూస్ చెబుతూ కీలక ప్రకటన చేశారు. చైనాపై సుంకాలను 10శాతం తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఫెంటనిల్ తయారీలో వాడే ముడి ఉత్పత్తుల రవాణాను కట్టడి చేసేందుకు జిన్‌పింగ్ తీవ్రంగా శ్రమిస్తారని భావిస్తున్నానని.. అందుకే ఫెంటనిల్ పేరుతో చైనాపై విధించిన 20శాతం సుంకాలను 10శాతంకు తగ్గిస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. దీంతో చైనాపై మొత్తం టారిఫ్ లు 57శాతం నుంచి 47శాతంకు దిగిరానున్నాయని తెలిపారు.జిన్ పింగ్ తో భేటీ అద్భుతంగా జరిగిందన్న ట్రంప్.. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని చెప్పారు. అమెరికా సోయాబీన్ ఉత్పత్తుల కొనుగోళ్లను చైనా తక్షణమే పునరుద్దరించేందుకు కూడా అంగీకారం కుదిరిందని.. అంతేకాక.. అరుదైన ఖనిజాలకు సంబంధించిన సమస్య కూడా పరిష్కారమైందని ట్రంప్ అన్నారు. మరిన్ని చర్చల కోసం ఏప్రిల్ నెలలో చైనా వెళతానని ట్రంప్ ప్రకటించారు.