Header Banner

మెగాస్టార్ డీప్‌ఫేక్‌పై సీపీ సజ్జనార్ తీవ్ర వ్యాఖ్యలు!

సాక్షి డిజిటల్ న్యూస్ :జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా తెలంగాణ పోలీసులు నిర్వహించిన రన్ ఫర్ యూనిటీలో డీజీపీ శివధర్ రెడ్డి, సినీనటుడు చిరంజీవితో కలిసి హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పాల్గొని మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి డీప్‌ఫేక్‌ అంశాన్ని సీరియస్ తీసుకున్నామని అన్నారు. డీప్ ఫేక్ కేసులో సైబర్ నేరస్తుల మూలాలపై ఫోకస్ పెట్టామని చెప్పారు. సైబర్ నేరాల పట్ల ఆందోళనకు గురికావద్దని సజ్జనార్ అన్నారు. ప్రజల్లో ఎంత అవగాహన తీసుకువస్తున్నా డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్, ఇతర సైబర్ మోసాలకు గురవుతున్నారని తెలిపారు. పిల్లలు రూ.5 వేలు, రూ.10 వేల కోసం సైబర్ నేరస్తులకు మ్యూల్ అకౌంట్స్ ఇస్తున్నారని సజ్జనార్‌ అన్నారు. దీని వల్ల వీరు కూడా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ శ్రీకాంత్ గౌడ్‌ను సస్పెండ్ చేశామని సజ్జనార్ చెప్పారు. నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. ఉప్పలపాటి సతీశ్‌పై సీఐడీ, జీఎస్టీకి సంబంధించిన కేసులు ఉన్నాయని అన్నారు. నిందితుల కోసం ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసామని తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని అన్నారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొందరు డీప్‌ఫేక్‌ వీడియోలు సృష్టిస్తున్నారంటూ ఇటీవల హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌కు మెగాస్టార్‌ చిరంజీవి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సైబర్‌క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.