సాక్షి డిజిటల్ న్యూస్ :భారత మహిళల క్రికెట్ జట్టు ఈ రోజు పీఎం నరేంద్ర మోదీని ఢిల్లీలో కలిశారు. ఈ క్రమంలో భారత మహిళల క్రికెట్ జట్టును అభినందించిన ప్రధాని.. ఈ విజయం భవిష్యత్ క్రీడాకారులకు స్పూర్తినిస్తుందంటూ కొనియాడారు. అనంతరం మహిళా క్రికెటర్లను మోదీ సన్మానించారు.చరిత్రలో తొలిసారిగా ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ను గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచిన భారత మహిళల క్రికెట్ జట్టు (Indian Women’s Cricket Team) ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బుధవారం సాయంత్రం 6 గంటలకు కలవనున్నారు. ఈ అద్భుత విజయాన్ని సాధించిన ‘నారీ శక్తి’ని ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించిన సంగతి తెలిసిందే.
ఢిల్లీలో ఘన సన్మానం.. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించి, కప్ను కైవసం చేసుకున్న అనంతరం, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు నేడు ఢిల్లీకి చేరుకుంది ఈమేరకు ప్రపంచకప్ విజేతలను ప్రధానమంత్రి కార్యాలయం (PMO) అధికారికంగా ఆహ్వానించింది. ప్రధాని మోదీ స్వయంగా క్రీడాకారిణులతో ముచ్చటించి, వారిని ఘనంగా సత్కరించనున్నారు. భారత జట్టు విజయం సాధించిన క్రమంలో ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 ఫైనల్స్లో భారత జట్టు అద్భుతమైన విజయం సాధించింది. టోర్నమెంట్ అంతటా క్రీడాకారిణులు చూపించిన నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, అసాధారణమైన సమన్వయం దేశానికి గర్వకారణం” అని కొనియాడారు.
యువతకు స్ఫూర్తి.. ప్రధానమంత్రి మోదీ ఈ విజయం కేవలం క్రీడా మైదానానికే పరిమితం కాదని, ఇది యావత్ దేశంలోని లక్షలాది మంది యువతకు, ముఖ్యంగా బాలికలకు గొప్ప స్ఫూర్తినిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇది కేవలం ఒక కప్ గెలవడం మాత్రమే కాదు. ఇది భారతదేశంలోని నారీశక్తి పెరిగిన ఆత్మవిశ్వాసానికి, బలానికి ప్రతీక. మన గ్రామాలు, చిన్న పట్టణాల నుంచి వచ్చిన ఈ కూతుళ్లు క్రీడలను స్వీకరించడానికి భవిష్యత్తు ఛాంపియన్లను ప్రేరేపిస్తారు అంటూ నరేంద్ర మోదీ తెలిపారు.చాలా మంది క్రీడాకారిణులు చిన్న ప్రాంతాలు, సాధారణ కుటుంబాల నేపథ్యం నుంచి వచ్చినవారే అని ప్రధాని గుర్తు చేస్తూ, వారి తల్లిదండ్రులను కూడా ఆయన ప్రశంసించిన సంగతి తెలిసిందే.
చారిత్రక ఘట్టం.. మహిళల క్రికెట్లో భారత్కు ఇదే తొలి ఐసీసీ టైటిల్ కావడంతో, ఈ విజయాన్ని దేశం మొత్తం ఉద్విగ్నంగా, చారిత్రక ఘట్టంగా భావించింది. గతంలో పురుషుల జట్టు 1983లో ప్రపంచకప్ గెలవడం దేశ క్రికెట్కు ఒక టర్నింగ్ పాయింట్గా నిలిచిన విధంగానే, ఈ విజయం కూడా భారత మహిళల క్రికెట్కు ఒక ‘గోల్డెన్ చాప్టర్’అవుతుందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో భారత జట్టు అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా, బీసీసీఐ (BCCI) క్రీడాకారిణులు, సహాయక సిబ్బందికి రూ. 51 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించింది.