సాక్షి డిజిటల్ న్యూస్ :భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 21 తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి నవంబరు 20న తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకుని అనంతరం తిరుమలకు చేరుకుంటారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఏర్పాట్లపై గురువారం తిరుమలలోని పద్మావతి విశ్రాంతి భవనం సమావేశ మందిరంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు.
రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సమీక్ష: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అధ్యక్షతన తిరుమలలోని పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో ఉన్నత స్థాయి రివ్యూ సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో సీవీఎస్వో మురళీకృష్ణతో పాటు ఇతర విభాగాల అధిపతులు పాల్గొన్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా.. భద్రత, వసతి, దర్శన ఏర్పాట్లపై వారు చర్చించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా.. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులకు అదనపు ఈవో ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఎస్వీబీసీ సీఈఓ శ్రీ ఫణికుమార్ నాయుడు, సీఈ సత్యనారాయణ, అదనపు ఎస్పీ రామకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.