సాక్షి డిజిటల్ న్యూస్ :జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ జయకేతనం ఎగురవేశారు. తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 25 వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపొందారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే ఇది అత్యధిక మెజార్టీ. ఓట్ల లెక్కింపు మొదలైన దగ్గరి నుంచి నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. రౌండ్ రౌండ్కూ అది మరింత పెరిగిందన్నారు. ఏ ఒక్క రౌండ్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యం దక్కించుకోలేకపోయారు. గెలుపు రేవంత్రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎంతో ఉత్సాహానిచ్చింది. నవీన్ యాదవ్ విజయాన్ని ఈసీ అధికారికంగా ప్రకటించి, గెలుపు పత్రం అందజేసింది. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ అభ్యర్థులకు 2023 ఎన్నికల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. బీజేపీకి డిపాజిట్ గల్లంతైంది.కాంగ్రెస్ పార్టీ విజయంలో సీఎం రేవంత్రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు దగ్గరుండి ఆయన పర్యవేక్షించారు. మైనార్టీల్లో మరింత పట్టుకోసం పోలింగ్కు కొద్దిరోజుల ముందు అజారుద్దీన్కు మంత్రి పదవి కట్టబెట్టారు. డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి సమన్వయం చేశారు. క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి శ్రేణుల్లో జోష్ నింపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా సీఎం చర్యలు చేపట్టారు.