Header Banner

రోడ్డుప్రమాదం: వేగంగా వచ్చిన కారు యువకులను ఢీకొట్టి పరారి—పోలీసుల విచారణ

సాక్షి డిజిటల్ న్యూస్ :ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన ఓ కారు స్కూటర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ షాకింగ్ ప్రమాదం నవాబాద్ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన సిసిటివి ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కారు డ్రైవర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నవాబాద్ ప్రాంతంలోని అటవీ శాఖ కార్యాలయం సమీపంలో గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌పై ప్రధాన రహదారిపై వెళుతుండగా, వారి వైపు వేగంగా దూసుకొచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. కారు ఢీకొట్టడంతో స్కూటర్ గాల్లోకి ఎగిరిపోయింది. స్కూటర్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎగిరి దూరంలో పడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ వ్యవహరించిన తీరు చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. బాధితులు రోడ్డుపై విలవిలలాడుతున్నప్పటికీ, డ్రైవర్ కనీసం వేగాన్ని తగ్గించకుండా అలాగే వెళ్లిపోయాడు. స్థానికులు గాయపడ్డ యువకులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యలు తెలిపారు. నిర్లక్ష్యంగా కారు నడిపిన డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నవాబాద్ పోలీసులు ఈ సంఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని ఆధారంగా డ్రైవర్‌ను గుర్తించే పనిలో ఉన్నారు. నిందితుడిని వదిలిపెట్టేది లేదని.. తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.