సాక్షి డిజిటల్ న్యూస్ :లంచం ఇవ్వొద్దు అంటూ తాటికాయంత అక్షరాలతో ఆఫీసుల ముందు అతికిస్తోంది ఏసీబీ. ఇలాంటి పోస్టర్స్ ప్రభుత్వాఫీసుల్లో మనకూ తరచూ కనిపించేవే. ఏసీబీ తరచూ వినిపించేదే. అయినా వారి అవినీతికి అంతం ఉంటుందా అంటే లేదు. లంచాల కోసం స్పెషల్గా ప్రవేట్ అసిస్టెంట్స్ను నియమించుకుంటున్నారు..మేడమ్ మహా స్ట్రిక్ట్.. ఒక్క రూపాయ్ లంచం తీసుకోరు.. నీతి, నిజాయితీకి నిలువుటద్దం మా మేడమ్..! ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో ఇలాంటి బిల్డప్పే ఉంటుంది. నిజమే.. ఏ మేడమూ లేదా ఏ సారూ నేరుగా రూపాయ్ ముట్టుకోరు.. “పేటీఎం కరో” టైప్లో తెరవెనుక కథ నడిపిస్తారు..! తాజాగా అలాంటి ఓ అవినీతి మేడమ్ గారికి చెక్ పెట్టారు అవినీతి నిరోధక బ్యూరో అధికారులు. మిషన్ భగీరథ (INTRA)లో పనిచేస్తున్న లేడీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను రూ.10,000 లంచం డిమాండ్ చేసినందుకు అరెస్టు చేశారు. నిందితురాలైన అధికారిణి కూనమల్ల సంధ్యా రాణి జనగాం జిల్లాలోని పాలకుర్తి సబ్ డివిజన్ పరిధిలో ఉద్యోగం చేస్తున్నారు. మిషన్ భగీరథ కింద ఫిర్యాదుదారుడు ఏర్పాటు చేసిన పైప్లైన్ పనులను తనిఖీ చేసి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు రిపోర్ట్ ఇవ్వడం ఆమె విధి. అయితే అందుకు చేయి తడవాల్సిందే అని స్పష్టం చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఆమె ప్రైవేట్ అసిస్టెంట్ మహేందర్ యుపిఐ ఖాతా ద్వారా లంచం తీసుకోగా.. అధికారులు రంగంలోకి దిగి అరెస్ట్ చేశారు. అధికారిక పని కోసం ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని ACB ప్రజలను కోరింది.