సాక్షి డిజిటల్ న్యూస్ :కేరళలోని వయనాడ్ జిల్లాలో స్థానికులను ఆశ్చర్యపరిచిన దృశ్యం వెలుగులోకి వచ్చింది. కల్లాడి-అరన్మల రోడ్డులో ఒక జింకను పూర్తిగా మింగిన ఓ కొండచిలువ, దాని భారీ శరీరంతో రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తోంది. రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆ కొండచిలువ కదిలేందుకు ఎంతగానో కష్టపడుతోంది. ఈ సంఘటన మెప్పాడి ప్రాంతంలో జరిగింది. ఇక్కడ రోడ్డు దట్టమైన అడవితో సరిహద్దుగా ఉంది. స్థానికుల వివరణ మేరకు ఆ కొండచిలువ రోడ్డు పక్కన ఉన్న అడవిలో ఒక జింకను వేటాడి దానిని పూర్తిగా మింగేసింది. ఆ తర్వాత దాని శరీరం చాలా ఉబ్బిపోయింది. దాంతో అది కదలలేక పోతుంది. నెమ్మదిగా రోడ్డు మధ్యలోకి వెళ్ళింది. ఆ దారిలో వెళ్ళే వారు దూరంగా ఆగి ఆగిపోయి చూస్తున్నారు.నడిరోడ్డుపై అడ్డంగా, అతికష్టంగా పాకుతూ ఉన్న భారీ కొండచిలువను చూసిన చాలా మంది వాహనదారులు, ప్రజలు ఈ సంఘటనకు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు. కొందరు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ అప్పటికి పాము అడవిలోకి వెళ్లిపోయింది. కానీ, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అవి వేంగంగా వైరల్ అయ్యాయి.అదృష్టవశాత్తూ ఈ ఘటనలో స్థానిక నివాసితులు ఎవరూ గాయపడలేదు. వాహనాలు కూడా సురక్షితంగా బయటపడ్డారు. అటువంటి సమయాల్లో అడవి జంతువులను సమీపించవద్దని అటవీ శాఖ ప్రజలను హెచ్చరించింది. పాములు లేదా ఇతర వన్యప్రాణులను ఇబ్బంది పెట్టడం ప్రమాదకరం. ఏదైనా ప్రాంతంలో అడవి జంతువులు కనిపిస్తే, వాటిని ఆటపట్టించడం లేదా వాటిని వీడియోలు తీయడం మానుకోవాలని అటవీ అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. వన్యప్రాణులు ఆపదలో ఉంటే వెంటనే అటవీ శాఖకు తెలియజేయాలని సూచించారు.