సాక్షి డిజిటల్ న్యూస్ : శ్రీశైలం వెళ్లే మల్లన్న భక్తులకు ఆలయ అధికారులు అలర్ట్ ఇచ్చారు. ఈ నెల(డిసెంబర్) 8 వరకు స్పర్శ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆలయంలో భక్తుల రద్దీ నేపథ్యంలో.. ఈనెల 8 వరకు స్పర్శ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆలయంలో శివదీక్ష విరమణల రద్దీ కొనసాగుతున్న క్రమంలో.. రద్దీ ఎక్కువగా ఉందని ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. అంతేకాదు సిఫార్సు లేఖలతో వచ్చే భక్తులకు కూడా స్పర్శ దర్శనం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. కాగా, రేపు (డిసెంబర్ 5) రూ.5 వేల గర్భాలయ అభిషేకం, రూ.1,500 సామూహిక అభిషేకం ఉంటుందని తెలిపారు. శ్రీశైలంలో స్పర్శ దర్శనానికి ఆన్ లైన్ ద్వారా భక్తులు భారీ సంఖ్యలో నమోదు చేసుకుంటున్నారు. మరోవైపు శివమాల వేసుకున్న భక్తులు కూడా భారీగా ఆలయానికి తరలి వస్తున్నారు. దీంతో ఆలయంలో భక్తుల రద్దీ పెరగడంతో.. స్పర్శ దర్శనానికి చాలా సమయం పడుతోంది. క్రమంగా భక్తులు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో.. ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కంపార్టుమెంట్ల వద్ద ఉండే భక్తులకు అల్పాహారం, మంచినీరు పంపిణీ చేస్తున్నారు. అలాగే భక్తులకు ఎలాంటి అసౌర్యం కలగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.