సాక్షి డిజిటల్ న్యూస్ : ఇండిగో విమానాల ఆలస్యాలు, రద్దుల కారణంగా దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న సమయంలో సినీ నటుడు సోనూ సూద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తన కుటుంబ సభ్యులు కూడా ఇండిగో ఫ్లైట్ ఆలస్యం కారణంగా ఇబ్బందులు పడ్డాయని పేర్కొన్న ఆయన, అయినప్పటికీ ఈ పరిస్థితులకు ఎయిర్లైన్ గ్రౌండ్ స్టాఫ్ బాధ్యత కాదని స్పష్టం చేశారు. టర్మినల్స్లో ప్రయాణికుల కోపం కింది స్థాయి సిబ్బందిపై చూపడం అన్యాయమని, వారు కూడా మనలాంటి మనుషులేనని, తమ చేతిలో నియంత్రణలేని పరిస్థితుల్లో పనిచేస్తున్నారని తెలిపారు. "మీరు వారి స్థానంలో ఉంటే ఎలా అనిపిస్తుంది?” అని ప్రశ్నించిన సోనూ సూద్, ఇలాంటి సంక్షోభ సమయంలో కోపాన్ని తగ్గించుకుని, సహనంగా, గౌరవంగా ప్రవర్తించాలని వినమ్రంగా కోరారు. సాంకేతిక సమస్యలు, సిబ్బంది కొరత, కొత్త డ్యూటీ టైమ్ నిబంధనల వంటి కారణాలతో విమాన సేవలు దెబ్బతింటున్నాయని, కానీ వాటికి బాధ్యులైన వారు కౌంటర్ వద్ద కనిపించే ఉద్యోగులు కాదని ఆయన స్పష్టంగా తెలియజేశారు. సోనూ సూద్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారగా, పలువురు నెటిజన్లు ఆయన మానవీయ కోణాన్ని ప్రశంసిస్తున్నారు.ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికులు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి నిజమేనని సోనూ సూద్ అంగీకరించారు. పెళ్లిళ్లు, ముఖ్యమైన అపాయింట్మెంట్లు, ఉద్యోగ ఇంటర్వ్యూలు, కుటుంబ కార్యక్రమాలు వంటి కీలక పనులు ఆలస్యమవడం వల్ల నిరాశ కలగడం సహజమని అన్నారు. కానీ ఆ కోపాన్ని తప్పు వ్యక్తులపై చూపడం సమస్యకు పరిష్కారం కాదని, మరింత గందరగోళాన్ని మాత్రమే సృష్టిస్తుందని పేర్కొన్నారు. సమస్యను ప్రశాంతంగా, క్రమబద్ధంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని, ఎయిర్లైన్ ఉన్నతాధికారులు, కస్టమర్ కేర్ ద్వారా ఫిర్యాదు చేయడమే సరైన మార్గమని సూచించారు.