Header Banner

నేత అరెస్టుతో ఆగ్రహించిన కిషన్ రెడ్డి – పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు

సాక్షి డిజిటల్ న్యూస్ :తెలంగాణలో ప్రతిపక్షంపై అణచివేత మరింత తీవ్రతరమవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. అప్పుడు బీఆర్‌ఎస్.. ఇప్పుడే కాంగ్రెస్ అదే మార్గంలో ప్రయాణిస్తున్నాయని ఆయన ఆరోపించారు. బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్‌ను అర్ధరాత్రి ఇంటి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఒక పోస్టర్ పెట్టి ప్రశ్నిస్తే.. ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అంటూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌‌లో పెట్టుబడిదారులకు ఒకవైపు ఆహ్వానం పలుకుతూ..  మరోవైపు రాష్ట్రంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరిస్తున్నారని కిషన్ రెడ్డి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పెట్టుబడిదారులు నమ్మకంతో రాష్ట్రానికి రావాలంటే ఇది సరైన తీరు కాదన్నారు.  ప్రతిపక్ష నేతలను అర్ధరాత్రుల్లో అరెస్టు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.రాష్ట్రాన్ని పెట్టుబడులకు సురక్షిత గమ్యంగా చూపిస్తూనే, మరోవైపు రాజకీయ ప్రత్యర్థులను అరెస్టు చేస్తే.. దాని సందేశం ప్రపంచం ముందు ఎలా ఉంటుందో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. అరెస్టులు, బెదిరింపులతో.. ఇలా వ్యవహరిస్తే పెట్టుబడిదారులు తెలంగాణకు రావాలనుకుంటారా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.