సాక్షి డిజిటల్ న్యూస్ :రొమేనియాలో జరిగిన ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ఘటనలో వేగంగా వస్తున్న మెర్సిడెస్ ఒక బస్సు, రెండు కార్లను ఢీకొట్టింది. పెట్రోల్ బంకు సమీపంలో ఢీకొట్టినప్పుడు ఊహించని “ఎయిర్ మెర్సిడెస్”గా మారిందని యూరో వీక్లీ న్యూస్ తెలిపింది. డిసెంబర్ 3న ఒరేడియా నగరంలో సిసిటివిలో రికార్డైన ఈ ఆశ్చర్యకరమైన ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది.హైస్పీడ్ మెర్సిడెస్ కారు రాంగ్రూట్లోకి ప్రవేశించింది. అక్కడి డివైడర్ను ఢీకొట్టి అమాంతం గాలిలోకి ఎగిరి దూసుకెళ్లినట్లు ఫుటేజ్ చూపిస్తుంది. అక్కడ ఆగి ఉన్న కార్ల మీది గుండా ఆకాశంలో వాహనం దూసుకెళ్లింది. పెట్రోల్ బంకు నుంచి కొన్ని మీటర్ల దూరంలో ఉన్న ఒక మెటల్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో పెద్ద పేలుడు తృటిలో తప్పింది. పెట్రోల్ బంక్ను ఢీకొట్టి ఉంటే ఊహించని విధంగా ప్రమాదం జరిగి ఉండేది.నివేదికల ప్రకారం 55 ఏళ్ల డ్రైవర్ తీవ్రమైన డయాబెటిక్ తో బాధపడుతున్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. డ్రైవర్ ఒక్కసారిగా మూర్ఛపోవడంతో నియంత్రణ కోల్పోయి, కారు గాల్లోకి ఎగిరిందని పోలీసులు నిర్దారించారు. వాహనం ప్రమాదానికి గురైనప్పుడు ఉరుములతో కూడిన ప్రమాదం వినిపించిందని సమీపంలోని అపార్ట్మెంట్లలో నివసించే నివాసితులు తెలిపారు.