సాక్షి డిజిటల్ న్యూస్ :వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విరివిగా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా పులులు, చిరుతలకు సంబంధించిన వీడియోల పట్ల నెటిజన్స్ ఆసక్తి చూపుతుంటారు. అడవిలో పులుల విన్యాసాలు చూసేందుకు పలుచోట్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జంగిల్ సఫారీని నిర్వహిస్తోంది. ఇక అడవిలోని జంతువుల్లో అన్నిటికన్నా వేగంగా పరిగెత్తే జంతువుగా చిరుతకు పేరుంది. చిరుత కన్ను పడితే.. ఏ జంతువు కూడా తప్పించుకోలేదనే సంగతీ మనకు తెలిసిందే. ప్రస్తుతం చిరుతకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్స్.. వామ్మో అంటూ అవాక్కవుతున్నారు.వీడియో ప్రారంభంలో రన్నింగ్ ట్రైన్, ఆ ట్రైన్ పక్కనే ఉన్న ఓ ట్రాక్ మీద చిరుత వేగంగా పరిగెత్తుకొస్తుండటం కనిపిస్తుంది. చాలాసేపు పరిగెత్తిన ఆ చిరుత చివరికి.. ఆ రైలు వేగాన్ని అందుకోలేక పక్కన ఉన్న అడవిలోకి వెళ్లడం ఆ వీడియోలో కనిపిస్తోంది. అయితే, రెప్పపాటులో ఓటమిని ఒప్పుకోని ఆ చిరుత మళ్లీ.. రైలుతో పోటీ పడుతుంది. ఎట్టకేలకు అది అమాంతం ఎగిరి రైలు కిటికీల పక్కన కూర్చున్న ప్రయాణికుల మీద పంజా విసిరేందుకు ప్రయత్నిస్తుంది. అలా చాలా సార్లు ప్రయత్నించి విఫలం అవుతుంది. ఆ సీన్ చూసేందుకే చాలా భయంకరంగా ఉంది.అయితే వీడియో ముందుకు పోయిన క్రమంలో మరింత భయంకరమైన సీన్ కనిపిస్తుంది. ఇప్పుడు చిరుత పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి ట్రైన్ డోర్ గుండా లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో డోర్ పక్కన ఉన్న రాడ్ను పట్టుకుని అలాగే ఉండిపోతుంది. ఈ హఠాత్పరిణామంతో డోర్ దగ్గర ఉన్న ప్రయాణికులకు గుండె ఆగినంత పనియితుంది. వెంటనే తేరుకున్న ఓ ప్రయాణికుడు చిరుతను ట్రైన్ నుంచి కిందికి తోసేయబోయే ప్రయత్నంలో తాను కింద పడిపోతాడు. ఇంతటితో వీడియో ముగుస్తుంది. చూసేందుకు ఎంతో భయంకరంగా ఉన్న ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే ఈ వీడియో నిజమైనది కాదని.. ఏఐ సృష్టి అయి ఉంటుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే వైరల్ వీడియోపై అటవీశాఖ స్పందించింది. నకిలీ వీడియోలను సృష్టించడం మరియు షేర్ చేయడం శిక్షార్హమైన నేరమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ హెచ్చరించింది.