సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 7 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి
కౌసల్య కాలనీ అభివృద్ధి ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే సాధ్యమని, ఇందుకోసం ఐక్య కార్యాచరణ అత్యవసరమని కౌసల్య కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష అభ్యర్థి వి.రవీందర్ రెడ్డి అన్నారు. కౌసల్య కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఏ ఒక్క వ్యక్తికి గానీ, ఏ ఒక్క వర్గానికి గానీ చెందిన సంస్థ కాదని, కాలనీలో నివసించే ప్రతి కుటుంబానికి, ప్రతి అపార్ట్మెంట్కు చెందిన ప్రజాస్వామ్య వేదిక అని ఆయన స్పష్టం చేశారు.
కాలనీ ఐక్యత, పారదర్శక పాలన, ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్ణయాల స్వీకరణ అనే మౌలిక సూత్రాలతో ముందుకు సాగాలనే దృఢ సంకల్పంతో తాము మరియు తమ బృందం ఎన్నికల బరిలో నిలిచామని తెలిపారు. ప్రతి అపార్ట్మెంట్, ప్రతి వ్యక్తిగత ఇంటి ప్రతినిధుల అభిప్రాయాలకు సముచిత గౌరవం ఇస్తూ, అందరి భాగస్వామ్యంతో పాలన సాగించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు.కౌసల్య కాలనీలో నిత్యం ఎదురవుతున్న డ్రైనేజ్ సమస్యలు, తాగునీటి ఇబ్బందులు, భద్రతా లోపాలు, పచ్చదనం పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ వంటి కీలక సమస్యలపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతామని వి.రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. సమస్యలపై మాటలకే పరిమితం కాకుండా, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాశ్వత పరిష్కారాల దిశగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.ఈ నేపథ్యంలో కాలనీ సమగ్ర అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి నివాసితుడు తమ అమూల్య ఓటుతో తమ బృందానికి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాలనీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
