సాక్షి డిజిటల్ న్యూస్ 13/04/26 రంగారెడ్డి జిల్లా ఫరక్ నగర్ మండల్ రిపోర్టర్ జీఎస్కే
షాద్నగర్ పరిధిలోని సాయిబాబా కాలనీలో గల 3వ, నెంబర్ అంగన్వాడీ కేంద్రాన్ని సీడీపీఓ శ్రీమతి ఉదయ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని పలు అంశాలను సవివరంగా పరిశీలిస్తూ, పిల్లల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారు. తనిఖీలో భాగంగా కేంద్రంలో అమలవుతున్న కమిటీ వ్యవస్థ గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అక్కడి చిన్నారుల ఎత్తు, బరువు వివరాలను స్వయంగా పరిశీలించి, రికార్డులతో సరిపోల్చి చెక్ చేశారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సిబ్బందికి సూచించారు. కేంద్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ ప్రసన్న విధులకు సమయానికి హాజరు కావాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని గట్టిగా హెచ్చరించారు. పిల్లలకు అందిస్తున్న ఆహారం నాణ్యతపై కూడా ఆమె విచారణ జరిపారు. గుడ్లు, బాలామృతం, రేషన్ సరఫరా సక్రమంగా జరుగుతున్నాయా అని అడిగి తెలుసుకుని, సరైన పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మౌలిక సదుపాయాల విషయమై కూడా ఆమె పరిశీలన జరిపి, కేంద్రంలో అవసరమైన సదుపాయాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని సూచించారు. సరఫరా అవుతున్న ఆహార పదార్థాల నాణ్యత, సరఫరా సంస్థల వివరాలపై కూడా సమాచారం సేకరించారు. ఈ సందర్భంగా సీడీపీఓ ఉదయ మాట్లాడుతూ.. చిన్నారుల ఆరోగ్యం, పోషణపై ఎటువంటి నిర్లక్ష్యం సహించబోనని స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాలు పిల్లల భవిష్యత్తుకు పునాది వంటివని, అందువల్ల సిబ్బంది తమ విధులను కచ్చితంగా నిర్వర్తించాలని సూచించారు.
స్థానికులు సీడీపీఓ ఆకస్మిక తనిఖీపై హర్షం వ్యక్తం చేస్తూ, ఇలాంటి తనిఖీలు తరచుగా నిర్వహిస్తే కేంద్రాల పనితీరు మరింత మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు..