విందులో మటన్ తినడంతో జరిగిన విషాదం: అసలు కారణంపై స్పష్టత కోసం దర్యాప్తు

సాక్షి డిజిటల్ న్యూస్ :కొత్త ఇల్లు పూర్తి అయ్యిందన్న సంతోషంలో యజమాని దావత్ ఏర్పాటు చేశాడు. మేస్త్రీలు, సన్నిహితులను పిలిచాడు. అంతా దావత్‌లో మునిగిపోయారు. మందు తాగేవారు తాగుతున్నారు.. మటన్ తినేవారు తింటున్నారు. ఇంతవరకు అంతా బాగానే ఉండగా.. ఒక్కసారిగా ఊహించని ఘటన జరిగడంతో విందు కాస్త విషాదంగా మారింది.విందులో భోజనం చేస్తుండగా లక్ష్మయ్య గొంతులో అకస్మాత్తుగా మటన్ బొక్క ఇరుక్కుపోయింది. ఊపిరి తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడిన లక్ష్మయ్య అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఇది గమనించిన తోటివారు హుటాహుటిన చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే దురదృష్టవశాత్తూ ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గమధ్యలోనే లక్ష్మయ్య ఊపిరాడక మృతి చెందారు. మటన్ ఎముక శ్వాసనాళంలో ఇరుక్కోవడమే మరణానికి ప్రధాన కారణం. అంతేకాకుండా భోజనం చేసే సమయంలో లక్ష్మయ్య మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త ఇల్లు పూర్తైందన్న సంతోషంలో ఏర్పాటు చేసుకున్న విందు ఇలా విషాదంగా ముగియడంతో బొందలపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *