విమాన టికెట్ ధరల విషయంలో కేంద్రం కఠిన చర్యలు ప్రారంభం!

సాక్షి డిజిటల్ న్యూస్ : దేశీయ విమానయాన రంగంలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సర్వీసులు నిలిచిపోవడం, భారీగా విమానాలు రద్దు కావడంతో టికెట్ ధరలు అమాంతం పెరిగాయి. ఈ పరిణామంపై స్పందించిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఎకానమీ క్లాస్ టికెట్ ధరలపై పరిమితులు విధిస్తూ డిసెంబరు 6న ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా ఎయిర్ ఇండియా గ్రూప్ తమ రిజర్వేషన్ సిస్టమ్స్‌లో కొత్త ధరల విధానాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఇప్పటికే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఈ మార్పులను పూర్తి చేయగా, ఎయిర్ ఇండియా డిసెంబరు 8 సోమవారం నుంచి అమలులోకి తీసుకొచ్చింది.ఇది ఎకానమీ క్లాస్‌ టికెట్లకు వర్తిస్తుందని ఆ సంస్థ పేర్కొంది. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు చేసింది. డిసెంబర్‌ 6వ తేదీన పౌర విమానయాన మంత్రిత్వశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను అమలుచేసే క్రమంలో ఎకానమీ క్లాస్‌ టికెట్ల బేస్‌ ధరల పరిమితిని అమలుచేస్తున్నాం. మా రిజర్వేషన్‌ వ్యవస్థలో కొత్త ధరలు అమల్లోకి తీసుకొచ్చాం. ధర పరిమితి అమలును ఎయిర్‌ ఇండియా కొనసాగిస్తుంది. వచ్చే మరికొన్ని గంటల్లో ఇది పూర్తిగా ప్రభావం చూపిస్తుంది. అలాగే థర్డ్-పార్టీ రిజర్వేషన్ ప్లాట్‌ఫామ్‌లతో సమన్వయం చేసుకోవాల్సి ఉన్నందున, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దశలవారీగా ఈ ప్రక్రియను అమలు చేస్తున్నామని ఎయిర్ ఇండియా వివరించింది. ఈ మార్పులు జరుగుతున్న సమయంలో ఎవరైనా ఎయిర్‌ఇండియా ఎకానమీ క్లాస్‌ టికెట్లను నిర్ధారించిన బేస్‌ ధరల కంటే ఎక్కువకు బుకింగ్‌ చేసుకొంటే.. ఆ వ్యత్యాసం మొత్తం రిఫండ్‌ చేస్తామని అని ఎక్స్‌లో పెట్టిన పోస్టులో వెల్లడించింది. ఇండిగో సంక్షోభం తర్వాత విమానయాన సంస్థల ధరలపై ప్రభుత్వం నిఘా పెట్టింది. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు టికెట్ ధరలను అదుపులో ఉంచాలని అన్ని సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *