ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ప్రతిష్టాపనపై వివాదం: అడ్డుకున్నవారి వివరాలు వెలుగులోకి

సాక్షి డిజిటల్ న్యూస్ : హైదరాబాద్‌లోని ప్రముఖ సాంస్కృతిక కేంద్రమైన రవీంద్రభారతి ప్రాంగణంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుపై వివాదం నెలకొంది. డిసెంబర్ 15న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని భాషా సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. న‌టుడు శుభ‌లేఖ సుధాక‌ర్‌, క‌మిటీ స‌భ్యుల‌తో క‌లిసి పర్యాటక‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఏర్పాట్లను ప‌రిశీలించారు.ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమం డిసెంబరు 15న రవీంద్రభారతి ఆవరణలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సినీ నటుడు శుభలేఖ సుధాకర్‌ ఆహ్వానించారు. రవీంద్రభారతి ఆవరణలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.అయితే రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటును కొందరు తెలంగాణ వాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహ ఏర్పాటు పనులను తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. శుభలేఖ సుధాకర్‌, పృథ్వీరాజ్ మధ్య వాగ్వాదం జరిగింది. తెలంగాణ గడ్డపై గద్దర్, ప్రముఖ కవి అందెశ్రీ వంటి వారికి ముందు గౌరవం దక్కాలని.. బయటి వ్యక్తులకు ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయడానికి అంగీకరించబోమన్నారు పృథ్వీరాజ్. ఈ క్రమంలో శుభలేఖ సుధాకర్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. రవీంద్రభారతిలో ఎస్పీబీ విగ్రహ ఏర్పాటును తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకస్తున్నారు. మరి డిసెంబర్‌ 15న ఎస్పీబీ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందా..? లేదా..? అన్నది చూడాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *